( ShyamMohan )
” బీబీసీకి వార్తలు ఇచ్చే అవకాశం వచ్చింది. నాతో పాటు మీరు కూడా రిపోర్టింగ్ కి రావాలి…” అన్నారు. శ్రీరామ్మూర్తి గారు. నాటుకోడి లెగ్ పీస్ అందుకుంటూ, ఇద్దరం గంగూరులో రోడ్ సైడ్ రెస్టారెంట్లో ఉన్నాం. హైదరాబాద్లో ప్యారడైజ్ లాగే, విజయవాడలో గంగూరు బిర్యానీ ఫేమస్. బందరు రోడ్ నుండి గంగూరు గంటలోపు జర్నీ,
సీన్ కట్ చేస్తే మర్నాడు గుంటూరులో ఉన్నాం. ఆయన కొందరు ఓటర్ల తో మాట్లాడుతుంటే నేను వాయిస్ రికార్డు చేశాను. సాయంత్రానికి కలెక్టర్, ఎస్పీ లను కలిసి వారి ఇంటర్వ్యూలను కూడా రికార్డ్ చేశాం.
రాత్రి 7 గంటలకు ఫీల్డ్ వర్క్ ముగించి, బస్ స్టాండ్ దగ్గర ఓ ఎస్టీడీబూత్ లోకి దూరి, ఢిల్లీలోని బిబిసి ఆఫీస్ కి ఫోన్ చేశారు. ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల ఫీడ్ బ్యాక్ టకటకా వివరించారు. సోనీ టు ఇన్ వన్ టేప్ రికార్డర్లో రికార్డు చేసిన వాయిస్ ని కూడా ఫోన్ దగ్గర ఉంచితే అవతల రికార్డ్ చేశారు.
తరువాత బయటకు వచ్చి డిన్నర్ చేసి, విజయవాడ బయలు దేరాం. 8 గంటలకు బీబీసీ రేడియోలో ఓ తెలుగు రచయిత్రి వాయిస్ ఓవర్తో మా రిపోర్ట్ ప్రసారం అవుతుంటే ఆయన కళ్లల్లో ఓ మెరుపు, అప్పట్లో (1985 అసెంబ్లీ ఎన్నికల టైమ్ ) బీబీసీ రేడియో వారు కొంతకాలం తెలుగు వార్తలు ఇచ్చారు. తరువాత ఎందుకో ఆ కార్యక్రమం ఆగిపోయింది. ఆ విధంగా రిపోర్టింగ్ ని, బొమ్మూరు బిర్యానీని పరిచయం చేశారాయన. ఆ రోజుల్లో బందర్ రోడ్ లోని ఓ ప్రముఖ పత్రికలో పనిచేస్తున్నాం. మా ఇద్దరివి పక్క పక్క సీట్లు.
ఆ తరువాత ఆయనకు హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ అయి వెళ్లారు. మరో ఏడాదికి నన్ను కూడా ట్రాన్స్ ఫర్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ త్రీలో ఉన్న ఆఫీసుకి వెళ్లి జాయిన్ అయ్యా.
యువ జర్నలిస్ట్ సుధాకర్ పక్కనే నా సీట్. ఒక గంట తరువాత హుందాగా కిల్లీ నములుతూ వచ్చి నా పక్క సీటులో కూర్చొని అల్లరిగా నవ్వాడు శ్రీరామ్మూర్తి, ” మిమ్మల్ని ఇక్కడికి ట్రాన్స్ ఫర్ చేయించింది ఈయనే..” అని సుధాకర్ నా చెవిలో ఊదాడు. సాయంత్రం డ్యూటీ ముగించుకొని బయట పడ్డాం. ” విజయవాడలో బతుకు తెరువు మార్గాలు తక్కువ. దేశంలో ఎక్కడి వాడైనా ఇక్కడ బతక గలడు. ” అని రెడ్ రోజ్ రెస్టారెంట్ లో ఇరానీ టీ తాగుతూ హైదరాబాద్ పరిచయం చేశారాయన. కొన్నేళ్లకు ఆయన మరో పత్రికలో చేరారు. నేను కూడా జూబ్లీ హిల్స్ లో కొత్తగా మొదలైన డైలీలో చేరాను. ఒక సాయంత్రం పేజీలు పెట్టించే హడావడిలో ఉంటే పత్రికా ఓనర్ వచ్చి… “ఈ సారు చాలా సీనియర్. మన పత్రికలో చేరుతున్నారు. ఎడిటోరియల్స్ రాస్తారు..” అని పరిచయం చేశాడు. ఆయన వెనుక ఉన్న శ్రీరామ్మూర్తి దొంగనవ్వుతో ” నిను వీడని నీడను నేను….” అని పాడుతున్నాడు. ఇక్కడ కూడా
సెలక్టివ్ గా మా ఎదురుగానే అయన సీటు. ఎంత సరదాగా ఉంటాడో అంత సీరియస్. రాతలో ఎక్కడా రాజీ పడడు. శ్రీకాకుళం కొండల నడుమ, వంశధార నీళ్లు తాగి ఎదిగాడు. మూడు దశాబ్దాలుగా వివిధ పత్రికలకు ఆయన ఎడిటోరియల్స్ రాయడం చూశాను. జీవితంలోని సొగసును,జీవన బీభత్సాన్ని అక్షరాలుగా మార్చడం ఆయనకు తెలుసు. సుదీర్గ కాలపు ఆయన పాత్రికేయ జీవితం నాకు చాలా నేర్పింది. ‘నిజం‘ పేరుతో అరుదైన కవిత్వాన్ని రాస్తున్నారు. ఇపుడున్న ఆధునిక కవుల్లో రేపటి అత్యాధునిక కవి ఆయన.
“ రాత్రి కురిసిన మేఘాలను ఆరేసుకున్నది ఆకాశం. తెల్లచీరలు పరిచిన నీలి క్షేత్రం.
నీటిలో నీలాకాశాన్ని చూసి
దిగి వచ్చిన నక్షత్రాల్లా
తెల్ల కలువలు
నెలంతా తనను ఉండ నివ్వాలని
రాత్రికి వెన్నెల లేఖ
రాజ్యాంగం ఒప్పుకోదని చీకటి వాదన
భూమికి ఆకాశం పంపే పల్లకీ వెన్నెల అంటాడు….. మబ్బుల్ని దాటి, వెన్నెల మెట్లన్నీ ఎక్కి
మనకు కవిత్వం వినిపిస్తున్నాడు. ఆయన అక్షరాలలోని మెరుపులు, ఆశ్యర్యపరిచే పదచిత్రాలు , శబ్ద ప్రాధాన్యతను వివరించే భాషా పరిజ్నానం నాకు లేవు కానీ,నిజమైన కవిత్వానికి భుజకీర్తులు అవసరమా?
మీరిలాగే కూల్ గా , హ్యాపీగా ఉండాలి సార్. ( రెండేళ్ల తరువాత మొన్న ఇద్దరం కలుసుకున్నాం.)
How to make bamboo wine.. A forest of Thailand villagers use new way to make alcohol – by leaving liquor to purify inside BAMBOO wine https://youtu.be/qFM-eP8U0Ac