ఉత్తమ పద్ధతుల ద్వారా సుస్ఠిర పారిశ్రామికాభివృద్ధి’ అంశంపై భారత పరిశ్రమల సమాఖ్య (CII) గురువారం నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్లో శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పాల్గొని ప్రసంగించారు.
‘వర్క్, లివ్, లెర్న్, ప్లే’ ప్రాతిపదికగా శ్రీసిటీ నిర్మాణం జరిగిందన్న శ్రీసిటీ ఎండీ, ఇక్కడ చేపడుతున్న వివిధ హరిత కార్యక్రమాలు, నీటి వనరుల సంరక్షణ, శుద్ధి పరచటం, పునర్వినియోగం తదితర సుస్థిరత అంశాల గురించి వివరించారు. పర్యావరణ నిర్వహణ, కోవిడ్ సమయంలో ఆరోగ్య భద్రత అంశాలపై ప్రసంగిస్తూ, కోవిడ్ నివారణ చర్యలు సమర్థవంతంగా అమలుచేయడం, ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించడం ద్వారా శ్రీసిటీ ‘కరోనా-రహిత’ స్థితిని కొనసాగించడానికి, త్వరగా కార్యకలాపాలను పునః ప్రారంభించడానికి సాధ్యపడిందని అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అద్భుతమైన మద్దతును ప్రశంసిస్తూ, ఇందు మూలంగానే కఠినమైన కోవిడ్ ఆంక్షల సమయంలోను, పలు శ్రీసిటీ పరిశ్రమలు వ్యక్తిగత రక్షణ సామగ్రి (PPE) కిట్ల నుండి అత్యవసర ఆసుపత్రి పడకలు, వైద్య ఆక్సిజన్ సిలిండర్లు తదితర నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను ఉత్పత్తి చేశాయన్నారు.
ప్రభుత్వ అధికారులు, పర్యావరణం, ఆరోగ్య పై కోవిడ్ ప్రభావం గురించిన అవగాహన కలిగివున్న మేధావులు, ఇతర పరిశ్రమల ప్రతినిధులతో కలసి మొత్తం 80 మంది ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (APPCB) ఛైర్మన్ అశ్విని కుమార్ పరిదా కీలకోపన్యాసం చేసారు. ఫ్యాక్టరీల డైరెక్టర్ డి.చంద్రశేఖర వర్మ మాట్లాడుతూ, వివిధ నియమ నిబంధనల్లో మార్పులు, భద్రతా ప్రమాణాలపై దాని ప్రభావం, పరిశ్రమల బాధ్యతల గురించి వివరించారు. సీఐఐ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఎస్సార్ మరియ ఎన్విరాన్మెంట్ ప్యానెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.వి.ఎస్.నారాయణ రాజు, JSW గ్రూప్ గ్రూప్ హెల్త్ & సేఫ్టీ హెడ్ పరేష్ థక్కర్, గ్రీన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కౌన్సిల్ చైర్మన్ ప్రదీప్ ధోబలే, మరియు పరిశ్రమల ప్రతినిధులు ప్రసంగించారు.