జగన్ గారు, ఈ జనం మాట వింటారా ?

ట్రాన్స్ కో, జెన్ కో.. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? కనీసం ట్రాన్స్ఫార్మర్ అంటే కూడా వాళ్లకు తెలీదు. తెలిసిందల్లా.. అడవుల్లో కట్టెలు, కాయలు ఏరుకోవడం.. కూడు కోసం పోడు సేద్యం చేయడం. అలాంటి కష్టజీవులు సడన్ గా, ముఖ్యమంత్రి పేషీలో కనిపిస్తే, ఎలా ఉంటుంది.?

……………………………

సీఎం ఎదురుగా హూందాగా కూర్చోగా వారి చెరో పక్కన అధికారులు నిల బడి,వంగి వినయంగా ఫైళ్లమీద సంతకాలు తీసుకొని , ఎంఓయు కుదుర్చుకుంటుంటే… ఇది కలయా?నిజమా అని కళ్లు నలుపుకొని చూసే సరికి వారు మీటింగ్ ముగించుకొని, కట్టెలు ఏరుకొని కొండ దిగివస్తున్నట్టు… పేషీ మెట్లు దిగి, నవ్వుతూ బయటకు రావడం ఒక అబ్బురం !!

…………….

మైక్రో ఇరిగేషన్ సమాచారం కోసం, హైదరాబాద్ సెక్రటేరియట్లోకి వెళ్లగా, ‘ సి బ్లాక్ ’ దగ్గర ఎదురైన మనోహర దృశ్యం అది. అధికారులు హడావడిగా, ఫైల్స్ పట్టుకొని లోపలి నుండి బయటకు వస్తుంటే, వారి వెనుకే ఈ మహిళలు… ఒకరిని పకరిస్తే…‘‘ రంపచోడవరం ఏజెన్సీ నుండి వచ్చామండీ, సీఏం గారు కబురుచేశారు.’’ అందామె.మామూలు గా అయితే బడా కార్పొరేట్ కంపెనీ బాసులు CMO లో కనిపిస్తుంటారు..దీనికి భిన్నంగా మన్యంలో మట్టి పనులు చేసుకొనే, అతి మూమూలు ఆడవాళ్ళకు ముఖ్యమంత్రి అప్పాయింట్ మెంట్ ఇవ్వడం ఏమిటి? దీని వెనుకున్న ముచ్చటేమిటో, తెలుసుకోవాలనుకొ న్నా కానీ అప్పుడు కుదర లేదు.

………………….

సీన్ కట్ చేస్తే… ఏడాదిన్నర తరువాత ఒక రోజు నాబార్డ్ సీజీఎం మోహనయ్య గారు పిలిచారు. ‘‘ ఒక ఇంట్రస్టింగ్ కేస్ స్టడీ ఉంది. ఏలేరు నది మీద మహిళలు పవర్ ప్రాజెక్ట్ పెట్టారు. దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాం… మీరు స్టోరీ చేయాలి. ’’ అని, రెండు పేజీల నోట్ ఇచ్చారు. అక్కడ సీన్ కట్ చేస్తే… ఉదయం నాలుగింటికే రాజమండ్రి చేరుకొని అక్కడి నుండి కారులో రంపచోడవరం వైపు బయలు దేరాం. దాదాపు 120 కిలోమీటర్లు … కొండలు, కోనలు దాటి వెళ్తున్నాం. మంచు ముసుగులో పొలాల్లో కూలి పనులు చేస్తూ… కట్టెలు ఏరుతూ…జీడిమామిడితోటల్లోకి వెళ్తూ, జీలుగ చెట్ల మీద నీరా తీస్తు …అక్కడి ప్రజల జీవనం పచ్చగా, ఆహ్లాదంగా ఉంది. వంపులు తిరిగిన ఏలేరు ప్రవాహం చూడగానే దిగి మునకలు వేయాలని పించింది, కానీ సమయం లేక ముందుకు సాగాం. ఏలేరు … రంపచోడవరం ఏజెన్సీలో గిరిజనుల జీవధార. అన్ని కాలాల్లోనూ ప్రవహించే జీవనది. ఈ నది ఒడ్డునే ఉన్న వేటమామిడిలో, పవర్ ప్రాజెక్టు నిర్మించారు. పక్క గ్రామం వారు , వేటమామిడి రావడం అంత ఈజీ కాదు. చిక్కని అడవుల మధ్య అడ్డతీగల సమీపంలో తణుకురాతిపాలెం నుండి, ఏలేరు నదిని నడుం లోతు నీళ్లలో దాటాలి. ‘‘ మాకు రోజూ ఇంతే నండీ, రెండొందల మంది అటు ఇటు నదిని దాటి వెళ్లాలి, వానా కాలం లో ఐతే మెడలోతులో దాటాలి, చంటిబిడ్డల ను ఎత్తుకొని కూడా ఇలాగే వెళ్తాం, మాకేం భయం వేయదండీ ,అలవాటయి పోయింది…’’ అన్నారు, గ్రామస్ధులు .ఇలా ప్రతీ రోజు ఉదయం అడ్డంగా ప్రవహించే నీళ్లను దాటి వేటమామిడి చేరుకొని అవే జలాల నుండి విద్యుత్ తీసే ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నారు కొందరు మహిళలు. గ్రామంలోకి చేరుకున్నాం.

………………

రోడ్డు పక్కనే పెసరట్లు వేస్తున్నారు. పెనం మీద అవి కాలుతుంటే, సన్నగా తరిగిన, అల్లం, పచ్చిమిర్చి,పుదీనా చల్లు తున్నారు. సత్తు గిన్నెలోని ఇప్పనూనెను కొబ్బరి చిప్ప గరిటతో, రౌండ్ గా పోసి, అట్లు తిరగేసి లేత అరిటాకులో వేసి చేతిలో పెట్టారు. ఉప్మా కావాలంటే పెట్టు కోవచ్చు. ఛాయిస్ మనదే… నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. ‘‘ ఇక్కడ ఐదొందల కుటుంబాలు వరకు ఉంటాయండే. చేపల వేట, జీలుగ కల్లు, వరి, జీడిమామిడి పంటలే మాకాధారం. ఎవరికీ పెద్దగా సదువుల్లేవండీ బాబూ !!’’ పక్కనే పిండి రుబ్బుతున్న ఆమె ఊరిని పరిచయం చేసింది.

శ్రమ తప్ప చదువు లేని ఆడ వాళ్ళు ఏకంగా ఒక విద్యుత్ ప్రాజెక్టును నడపడం.. ఊళ్లోవాళ్లే నమ్మలేని ముచ్చట .అక్కడి నుండి సమీపంలోని, విద్యుత్ ప్రాజెక్ట్ కి చేరుకున్నాం. లోపల మిషన్ కి రిపేర్లు చేస్తున్నారు నలుగురు మహిళలు. అరగంట తరువాత మాకు ప్లాంట్ ని చూపించి, అక్కడి విశేషాలు చెప్పారు. …………………………………..

ఆ రోజు సెక్రటేరియట్లో చూసిన వాళ్లే వీరంతా… అప్పటి మీటింగ్ లో సీఎంతో తీసుకున్న ఫోటోలు చూపించింది సత్యవతి. ఈ టీమ్ కి ఆమె బాస్. ‘మా ఊరి పక్కనే పారే ఏలేరులో చేపలు పట్టుకోవడమే మాకు తెలుసు. ఇప్పుడు, ఇవే నీళ్లతో కరెంట్ ను తీయడం వింతగా అనిపిస్తుంది..’ అని సంతోషంగా చెప్పింది, బట్టు రాజేశ్వరి.

‘‘ ఈ ప్రాజెక్టు కోసం మాతో ఒక కమిటీ ఏర్పడింది . పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించాం. యంత్రాలు ఎలా వాడాలో, తెలుసుకున్నాం. ఉత్పత్తి మొదలు పెట్టిన తర్వాత.. మాలో ఎక్కడలేని నమ్మకం వచ్చింది.’ అన్నారు, ట్రైబల్ విమెన్ పవర్ ప్రాజెక్టు కమిటీ అసోసియేషన్ ఆఫ్ ది వేటమామిడి’ సభ్యులు మద్దికొండ దేవకాంతమ్మ,మడకం లక్ష్మి. వాగులు వంకల్లో పారే నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం, వచ్చిన ఆదాయంతో స్థానికుల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ,అప్పటి సర్కారు ఈ మినీ హైడల్ పవర్ ప్రాజెక్టు నెలకొల్పింది. నిర్మాణానికి నిధులు నాబార్డ్ ఇచ్చింది.

…………………………….

Understanding Women’s Empowerment

అడవితల్లిని నమ్ముకుని బతికే వీళ్లు.. అభివృద్ధికి దూరంగా ఉంటారనుకుంటాం. గుడ్డి దీపాల వెలుతురు లోనే బతుకుతారని భ్రమిస్తాం. ఇక్కడికి వస్తే మన అభిప్రాయాన్ని మార్చుకుంటాం. ఎందుకంటే, కరెంటుకు నోచుకోని ఆ గిరిజనులే ఇప్పుడు కరెంటు ఉత్పత్తికి నడుం బిగించారు. అక్షరం ముక్క రాని మహిళలే..12 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని సమర్థంగా నడుపుతున్నారు.

………………..

అంతా బాగుంది కానీ, ఇంతకూ శ్రమ జీవులను ఆనాడు తన పేషీ కి రప్పించిన సీఎం ఎవరనే కదా మీ సందేహం..?ఆనాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి.( 2007లో). సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, ఆత్మ విశ్వాసం తో బతకాలని,, వీరికి గుడ్డి దీపాల గూడేలను వెలిగించడం నేర్పారు. వారు వెలిగి. పదిమంది జీవితాలనూ దేదీప్యమానం చేస్తున్నారు కానీ, ఈ మహిళల కిచ్చే గౌరవ వేతనం చాలా స్వల్పం. ఆదేమీ ఆలోచించకుండా, ఊరి బాగు కోసం, ఒక పూట ప్లాంట్ లో పనిచేస్తూ, మరోపూట కూలికి వెళ్తున్నారు. ” మా కోసం, వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఒకడుగు ముందుకు వేసినప్పుడు , అయన తనయుడు జగన్ రెండడుగులు ముందుకు వేసి మాకు అండగా ఉంటారనే నమ్మకం తో పని చేస్తున్నాము ” అని అమాయకంగా అంటోంది సత్యవతి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles