పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తోన్న ‘ఆక్స్ ఫామ్’ సంస్థ ఈ రోజు ఒక షాకింగ్ నిజం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 11 మంది ఆకలితో మరణిస్తున్నారు. వారిలో ఎక్కువ శాతం మారుమూల తండాల్లో బతుకుతున్న వారే.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పేదరికం, ఆకలి చావులపై ఈ సంస్థ “The Hunger Virus Multiplies” పేరుతో నివేదిక రూపొందించింది. ప్రస్తుతం 155 మిలియన్ల మంది అత్యంత దారుణమైన ఆహార సంక్షోభ పరిస్థితుల్లో జీవిస్తున్నారని ఆక్స్ఫామ్ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 20 మిలియన్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇక ఇందులో రెండొంతుల మంది తమ దేశాల్లో నెలకొన్న అంతర్గత సైనిక ఘర్షణల కారణంగా ఆకలితో అలమటిస్తున్నారని నివేదిక తెలిపింది. కరోనా మహమ్మారి కంటే కరవు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయని, కొవిడ్ కారణంగా ప్రతి నిమిషానికి ఏడుగురు మరణిస్తుంటే.. ఆకలి ప్రతి నిమిషానికి 11 మందిని పొట్టనబెట్టుకుంటోందని పేర్కొంది.
ఈ నేపథ్యం లో ఆకలి నుండి కొందరి నైనా కాపాడ డానికి, దండకారణ్యం సమీపం లో పంచామృతం తయారు చేస్తున్నాడీ గోండు యువకుడు. దీనిని ప్రోటీన్ ఫుడ్ అంటారు. కొత్త గూడెం సమీపం లోని గిరిజన తండాలో Ruralhope Foundation సహకారం తో ,వందలాది చిన్నారులకు రోజూ అంద చేస్తున్నారు.
ఎక్కడా, ఎలా వెళ్ళాలి ?
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి 60 కిలో మీటర్లు వెళ్తే ఆకుపచ్చని తునికి, మోదుగ, ఇప్ప చెట్ల మధ్య పాల్వంచ, చుంచుపల్లి, చంద్రుగొండ,ఆళ్లపల్లి, టేకులపల్లి లో ఇరవైకి పైగా గిరిజన ఆవాసాలు కనిపిస్తాయి.
ఇక్కడ ఎక్కువ శాతం మహిళలు రక్తహీనత, పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు, స్వచ్ఛంద సంస్ధ ‘ ఇండిజీనస్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ‘ చేసిన స్టడీలో గుర్తించింది. రక్తహీనత నివారణకు గోధుమలు,జొన్నలు,పల్లీ పిండితో చేసిన పౌష్టికాహారాన్నిఎలా చేసుకోవాలో వారికి నేర్పారు. కొంత సాయం కూడా అందించారు. తమ పిల్లలకు బూస్ట్,హర్లిక్స్ కొనలేరు కాబట్టి ,వాటిలో కంటే ఎక్కువ పోషకాలున్న ఈ ఫుడ్ని ‘ఆదివాసీ హర్లిక్స్ అని పిలుచుకుంటారు.
గోధుమలు,జొన్నలు,శెనగల,పల్లీల ను పిండిగా తయారు చేసి,బెల్లం పొడి కలిపి తయారు చేస్తున్నారు. విద్యుత్ సౌకర్యం ఉన్న లక్ష్మీ దేవిపల్లి మండలం, రేగెళ్ల గ్రామంలో దీని తయారీ కోసం ఒక కేంద్రం ఏర్పాటు చేసి, ఇద్దరు గిరిజన యువకులు దీనిని తయారు చేస్తున్నారు.