నిరుపేద వ్యవసాయ కూలీల బిడ్డ రజని.
సగటు ఆడపిల్లలాగే ఆమె జీవితం గురించి ఎన్నో కలలు కన్నది. మంచి ఉద్యోగం పొంది అమ్మా,నాన్నల కష్టాలను తగ్గించాలనకుంది. పీజీ వరకు ఆటంకాలు లేకుండా చదివి. ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాస్లో పాసైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీకి అర్హత సాధించింది.
అదే సయయంలో పెద్దలు ఆమెకు పెళ్లి చేశారు. భర్త అనారోగ్యంతో ఆమె కథ అడ్డం తిరిగింది. ఇద్దరు ఆడపిల్లలు, అత్త, భర్త బాగోగులు చూసుకుంటూనే…పోటీ పరీక్షలు రాస్తూ, ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు.
బతుకుతెరువు కోసం సంతల్లో కూరగాయలు కూడా అమ్మింది. ప్చ్ అది కూడా కలిసి రాలేదు.
ఇక గత్యంతరం లేక… జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా చేరింది.
పది వేల జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఎమ్మెస్సీ చదివి స్వీపర్గా పనిచేస్తున్నందుకు రజని సిగ్గుపడటం లేదు. ‘వచ్చే కొద్దిపాటి డబ్బులతోనే అయిదుగురం బతకాలి. జీవితంలో చీకటి మాత్రమే శాశ్వతం కాదని, వెలుగు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నా.’ అంటుంది రజని.
హైదరాబాద్ జిలుగు వెలుగుల్లో కనిపించని ఈ చీకటి కోణాన్ని బయట పెట్టారు, జర్నలిస్ట్ కోట నీలిమ. ఏ మీడియా టచ్ చేయని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆమె నడుస్తున్నారు. ‘హక్కు’ యూట్యూబ్ ఛానెల్ ద్వారా వారి బతుకుల్లోని చీకటిని చూపిస్తున్నారు.. రజని స్టోరీ వినాలంటే… https://youtu.be/X9MXWFJSnGc చూడండి.
జర్నలిజం పూర్తిగా చెడిపోలేదు, విలువలు కనుమరుగై పోలేదని చెప్పడానికే నీలిమ లాంటివాళ్లు మన మధ్య ఉన్నారు.
గతంలో ఆమె ‘విడోస్ ఆఫ్ విదర్భ ’ రాసినపుడు…BBC కోసం ఆమెను ఇంటర్వ్యూ చేశాను. స్వచ్ఛమైన పాత్రికేయులుగా ఎదగాలనుకునే వారు మాత్రమే ‘హక్కు’ యూట్యూబ్ ఛానెల్ చూడండి.