తొమ్మిది రోజుల సంబురాలు… కఠోర నియమాలు.. డప్పుల మోతలు… తండాల్లో కేరింతలు… పెళ్ళికాని ఆడబిడ్డల ఆటాపాటలు.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాలు… బావమరదళ్ల అల్లరిచేష్టలు… ఆ పై భక్తి భావం… వీటన్నింటి మేళవింపే తీజ్ పండుగ!
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి సమీపంలోని
గిరిజన తండాల్లో, ఈ సందడిని రూరల్మీడియా క్యాప్చర్ చేసింది!
…………………..
పూర్వం తండాలలో తీవ్ర కరువు వచ్చినప్పుడు లోకం సుభిక్షంగా వుండాలని, తీజ్ పండుగ నిర్వహించేవారు.
ఈ పండుగ బతుకమ్మను పోలి ఉంటుంది. తీజ్ను ఎనిమిది రోజుల పాటు పూజించి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు.
ఈ ఉత్సవాలను పెళ్ళికాని ఆడపిల్లలే నిర్వహిస్తారు. వీరికి తండాపెద్దలు, సోదరులు సహకరిస్తారు.
వర్షాకాలం ప్రారంభంలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును ‘తీజ్’ అంటారు.
అలాగే గోధుమ మొలకలను కూడా ‘తీజ్’గా పిలుస్తారు.
బతుకమ్మను పూలతో అలంకరించినట్లే.. తీజ్ లో గోధుమ మొలకలను పూజించడం లంబాడీల ఆనవాయితీ.
ఆగస్టు నెలలో ఈ వేడుకలు మొదలువుతాయి.
బంజారాల సంస్కృతికి దర్పణం ఈ తీజ్ ఉత్సవం.
ఈ తొమ్మిది రోజులు అమ్మాయిలకు అగ్నిపరీక్షే. ఉప్పుకారం లేని భోజనం తినాలి. మాంసాహారాలు ముట్టకూడదు, తండా నుంచి బయటికి వెళ్లకూడదు.
యువతులు పుట్టమట్టి తెచ్చి కులదేవతలను కొలుస్తూ పాటలుపాడి తండా నాయకుని చేత బుట్టలో ఆ మట్టిని పోయించి గోధుమలను చల్లుతారు.
స్వయంగా మూడు పూటలు బావుల వద్దకు వెళ్లి బిందెలతో నీళ్లు తెచ్చి తీజ్ల పై చల్లుతారు.
అలా తొమ్మిది రోజుల్లో గోధుమ నారు ఏపుగా పెరుగుతుంది.
అలా బుట్టల్లో గోధుమ మొలకలను పెంచి , వాటి చట్టూ ఆడిపాడి, తొమ్మిదోరోజు వాగులో నిమజ్జనం చేస్తారు.
వర్షాలు సంవృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ఊరంతా బాగుండాలని, మంచి మొగుడు రావాలని కోరుకుంటూ, అంతరించి పోతున్న గిరిజన సంస్కృతిని అపూర్వంగా కాపాడుకోవడానికి అడవి బిడ్డలు ప్రతి ఏటా తీజ్ పండుగను భక్తిగా జరుపుతున్నారు.
………………